గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల పరిధిలో, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సంబంధిత పురపాలక సంఘం పరిధిలోనే నివాసం ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను వందశాతం చేరవేసేందుకు వీలుగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల్లో పని చేస్తున్న యావత్తు సిబ్బంది వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. డివిజనల్, మండల స్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సచివాలయ సిబ్బంది స్థానికంగానే నివాసం ఉంటూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: నేడు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్