Father Demanding For His Son : హైదరాబాద్లో తండ్రి, బంగ్లాదేశ్లో తల్లి, అమ్మమ్మ దగ్గర పిల్లాడు. ఇదీ ఆ కుటుంబ కథ. తండ్రి, కుమారుడికి ఉన్నది రెండు దేశాల మధ్య దూరం. భార్య చేసిన మోసానికి కన్న ప్రేమకు దూరమయ్యాడు ఆ తండ్రి. కుమారుడి ఆచూకీ కూడా చెప్పకుండా తన జీవితంతో ఆడుకుంటున్నారని ప్రభుత్వమే తమని ఆదుకొని కుమారున్ని తన దరికి చేర్చాలని వేడుకుంటున్నాడు.
ఇదీ జరిగింది : వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాగాని తిరుపతి ముంబయిలో భవన నిర్మాణ కూలీ. 2016లో అక్కడ రియా అనే మహిళ పరిచయమైంది. వీరిద్దరికీ గతంలోనే విడాకులు అయ్యాయి. అయినా మనసులు కలవడంతో ఇద్దరూ ముంబయిలోనే వివాహం చేసుకుని కాపురం పెట్టారు. 2017లో వీరికి కుమారుడు విశాల్ జన్మించాడు. ఏడాది వరకు కాపురం సవ్యంగానే సాగింది.
మరో వ్యక్తితో వివాహం : తిరుపతి తన సొంతూరుకు వచ్చిన సమయంలో రియా ముంబయిలో ఇంకొకర్ని వివాహమాడింది. విషయం తెలిసి ముంబయికి వెళ్లన తిరుపతికి బాబుని తీసుకుని వెళ్లాలని చెప్పింది రియా. తిరుపతి ఆ బాలుడిని హైదరాబాద్లోని బాలాపూర్కు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కొన్నాళ్లు బిడ్డను పట్టించుకోని రియా 2022లో విశాల్ను చూస్తానని తిరుపతిని ముంబయికి రావాలని కోరింది. కుమారుడిని అక్కడికి తీసుకెళ్లగానే రియా మూడో భర్త మరికొందరు దాడి చేసి బాబును వాళ్లతో తీసుకెళ్లారని తిరుపతి చెబుతున్నాడు.