యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్ మండలంలో బోదకాలు బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అర్హుల జాబితాను పంపాలని అధికారులను ఆదేశించగా వారు లిస్టును పంపలేదు. దీనితో వారికి పింఛన్ రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మోత్కూరు మండల కేంద్రంలోని బుజిలాపురం, పాడిమెట్ల తదితర గ్రామాల్లో ఫైలేరియా వ్యాధిగ్రాస్తుల సంఖ్య అధికంగా ఉంది.
అధికారుల జాప్యం... చేజారిన సాయం!!
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంది బోదకాలు బాధితుల పరిస్థితి. ప్రభుత్వం బాధితుల జాబితా పంపమంటే... యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు సకాలంలో పంపకపోవడంతో బాధితులకు సాయం అందకుండా పోయింది. దీంతో బోదకాలు వ్యాధిగ్రాస్తులు లబోదిబోమంటున్నారు.
ప్రభుత్వం బోదకాలు బాధితులకు ఫించన్ ఇస్తామని ప్రకటించగానే మోత్కుర్ మండల వ్యాప్తంగా ఉన్న సుమారు 200 మంది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాధి తీవ్రతను బట్టి మూడు గ్రూపులుగా బాధితులను గ్రేడింగ్ చేశారు. అలా గుర్తించిన వివరాలను సకాలంలో ఉన్నతాధికారులకు పంపకపోవడంతో మండల పరిధిలో ఒక్కరికి కూడా బోదకాలు బాధితులకు ప్రభుత్వ పింఛన్ మంజూరు కాలేదు. ఏడాది కాలం కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా అతీగతీ లేదని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ సా.6గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం