ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రైతన్నలు సాగు చేసినందున కొనుగోలు బాధ్యతా తీసుకోవాలి. లేదంటే కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. సీసీఐ కొనాలంటే అనేక నిబంధనలు ఉంటాయి. తేమ శాతం పరిగణించి, నాణ్యత సరిపోలితేనే ముందుకు వస్తుంది. మార్కెట్కు వచ్చే పత్తంతా సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అవకాశం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పత్తి కొనుగోలుకు ప్రత్యేక కార్యాచరణతో రైతులకు మద్దతు, గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టాలి. సీజన్ ఆరంభం నుంచే సరైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఇబ్బంది ఉండదు.
వర్షాలతో దెబ్బ
ఈసారి జూన్లోనే తొలకరి పలకరించింది. తర్వాత వరుసగా వానలు కురిశాయి. ఆగస్టులో భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. 50 నుంచి 100 శాతానికిపైగా అధిక వర్షపాతం నమోదైంది. వానల వల్ల వేల ఎకరాల్లో తెల్ల బంగారం దెబ్బతిన్నది. పొగాకు లద్దెపురుగు, గులాబీ రంగు పురుగు ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వానలు వరుసగా కురుస్తూనే ఉండడంతో నాణ్యతపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే రైతులు నష్టపోయారు. త్వరలో పంట చేతికొచ్చాక మార్కెట్కు తీసుకొస్తే అక్కడ నాణ్యత పేరుతో దళారులు తక్కువ ధర చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో త్వరగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేటు వ్యాపారులు రైతులను మోసం చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. గత రబీలో వరి, మక్కలను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో అన్నదాతలకు కష్టం తప్పింది. ఇదే విధంగా పత్తి విషయంలోనూ భరోసా ఇవ్వాలి.