సూర్యాపేట జిల్లాలో రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు లక్ష డెబ్భై వేల ఎకరాల్లో వరి సాగు అయినట్లు అధికారులు అంచనా వేశారు. వరితో పాటు పత్తి సాగు చేశారు. ఈ రెండు పంటలకు యూరియా అధికంగా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండుసార్లు వేయాల్సిన యూరియా ఒక్కసారి కూడా వేయలేదని రైతులు వాపోతున్నారు. వారం రోజులుగా యూరియా కోసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నా తమకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
54 వేల మెట్రిక్ టన్నులు అవసరం
జిల్లాకు 54 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఆగస్టు చివరి వరకు 23 వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. 20 వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. జిల్లాలోని ఎరువుల దుకాణాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి రైతులు వస్తుండటం వల్ల కొరత ఏర్పడుతోందని అధికారులు గుర్తించారు. సాగర్ ఆయకట్టు ప్రాంతమైన నల్గొండ జిల్లాలోని రైతులు అధికంగా యూరియాను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కొనుగోలు తగ్గించేందుకు ప్రతీ రైతు ఆధార్ కార్డుతో రావాలని నిబంధన విధించారు.