రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఉచిత చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారని మత్సకార సంఘం గుర్తు చేసింది. దీన్నే అవకాశంగా తీసుకున్న కొంతమంది మత్స్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉచిత చేప పిల్లలను సొసైటీలకు కాకుండా దళారులకు అందేలా ప్రొత్సహిస్తున్నారని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
రూ. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా...
ప్రభుత్వం మత్స్యకారుల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోన్నా... ప్రభుత్వ ఫలాలు మాత్రం మత్స్యకారులకు చేరట్లేదని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మత్స్య సహకార సంఘాలకు చేప పిల్లలకు బదులు ఆయా సొసైటీలకే నిధులు నేరుగా విడుదల చేయడం అన్ని విధాల శ్రేయస్కరమని సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
నేరుగా ఖాతాల్లోకే బదిలీ చేయాలి...
మత్స్య సొసైటీ అకౌంట్లలోకే నేరుగా డబ్బులు బదిలీ చేయాలని...అప్పుడే నాణ్యమైన చేప పిల్లలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షుడు గూడబోయిన సాయిలు బెస్త అన్నారు. ఫలితంగా మత్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ నూతన విధానం ఆస్కారం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ కళ్ళు కప్పి నాణ్యతలేని చేప పిల్లలు చెరువుల్లో వేస్తున్నారని.. ఫలితంగా చేప పిల్లలు ఆశించిన మేర ఎదగకపోవడం వల్ల మత్స్యకార సొసైటీలు ఎంతో నష్టపోతున్నాయని సాయిలు ఆందోళన వ్యక్తం చేశారు.