ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసుల్ని ఆశ్రయిస్తాం. ఆ పోలీసు శాఖే అన్యాయం చేస్తే ఎవరిని వేడుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన షేక్ ఖాసీం. ఆయన 1980 నుంచి 1999 వరకు పోలీసు శాఖలో పని చేశారు. పాల్వంచ ఠాణాలో విధుల్లో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురై అచేతన స్తితికి చేరుకున్నారు. తన స్థానంలో కుమారుడు యాకూబ్కు హోంగార్డుగా అవకాశం ఇవ్వాలని కోరారు.
కుమారుడు మృతి
ఇంతలో ఖాసీం కుటుంబంపై పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా భార్య మొగలాబికి నడుము విరిగిపోయింది. కుటుంబం మరింత దుర్భరమైన స్థితికి వెళ్లింది. ఇలాంటి సమయంలో కుమార్తె మీరాబీ తల్లిదండ్రులకు అండగా నిలిచింది. పెళ్లై అత్తగారింటికి వెళ్లిన అమ్మనాన్న దయనీయ పరిస్థితి చూసి పుట్టింటికి వచ్చింది. ఆమెకైనా కొలువిచ్చి ఆదుకోవాలని ఖాసీం వేడుకుంటున్నాడు.