ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు.. వైరస్ బారిన పడిన వారికి రక్తం, ప్లాస్మా దానం చేయాలని పలువురు బాలీవుడ్ హీరోలు సూచించారు. దీనిపై హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కొవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ ఉన్నాయని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ట్విట్టర్లో ఇటీవలే తెలిపింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్లు ట్విట్టర్లో స్పందించారు.
"మీలో ఎవరైనా కొవిడ్-19 నుంచి కోలుకుంటే.. కరోనాపై అస్త్రం మీరే అవుతారు. కంటికి కనిపించని శత్రువుతో చేసే పోరాటంలో మీరే మా సైన్యం. మీ రక్తంలో ఉండే బుల్లెట్లు (వైరస్కు వ్యతిరేకంగా పోరాడే కణాలు) కరోనాను చంపడానికి ఉపయోగపడతాయి. అందుకే మీరు రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలకు అండగా నిలవండి."