కరోనాను కట్టడి చేసే విషయంలో అమెరికా దూకుడుగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే భారత్ సహా 10 దేశాల కంటే అత్యధికంగా 4.18 మిలియన్ల మందికిపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
"మేము ప్రపంచ దేశాలకంటే ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించాం. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, భారత్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, స్వీడన్, కెనడా దేశాలతో పోలిస్తే మేము చేసిన పరీక్షలు అధికం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
50 శాతం తగ్గిన కేసులు...
ఇప్పటివరకు అమెరికాలో 40 వేల మందికిపైగా కరోనాకు బలయ్యారు. సుమారు 7లక్షల 64వేల మందికి ఈ మహమ్మారి సోకింది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్లో 2లక్షల 42వేల కేసులు నమోదు కాగా.. 17 వేలకుపైగా మృత్యువాత పడ్డారు. అయితే గత ఎనిమిది రోజుల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 50 శాతం తగ్గినట్లు ట్రంప్ పేర్కొన్నారు.