నగరంలో పరిశుభ్రతపై బల్దియా నజర్ వేసింది. సాఫ్, షాన్దార్ హైదరాబాద్, హరితహారం, కోర్టు కేసులు, స్ట్రీట్ వెండింగ్ పాలసీ తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రంలోనూ చెత్తను తరలించేందుకు వచ్చే సోమవారం నుంచి ప్రతి సర్కిల్లో 4 వాహనాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నగరంలో గుర్తించిన 161 సమస్యాత్మక ముంపు ప్రాంతాల చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 420 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా... 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వృథాగా రోడ్లపై వదులుతున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృథా చేసే నీరు ప్రస్తుతం చెన్నై నగరానికి అందించే నీటితో సమానమని ఆయన వివరించారు. నీటిని వృథా చేసేవారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉదయం 7గంటలలోపు క్షేత్రస్థాయిలో పర్యటించి... చెత్తను తొలగించే ప్రక్రియను ఫోటోల ద్వారా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.