మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై కొరడా ఝుళిపించింది. ప్రముఖ స్టాక్ బ్రోకర్ 'బీఆర్హెచ్ వెల్త్క్రియేటర్స్'కి సంబంధించిన కేసులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రూ . కోటి జరిమానా విధించింది.
రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. బీఆర్హెచ్ వెల్త్క్రియేటర్స్కు సెక్యూరిటీలు విక్రయించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ.. ఈ కేసుపై తుది నిర్ణయం వచ్చే వరకు రూ.158.68 కోట్లను 'ఎస్క్రో' ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తంపై ఏడు శాతం వడ్డీని కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది.
సెక్యూరిటీ మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు సాగించవద్దని.. 2019 అక్టోబర్ 7న బీఆర్హెచ్ వెల్త్క్రియేటర్స్, ఇతర సంస్థలకు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని లెక్క చేయకుండా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లావాదేవీలు జరిపినట్లు సెబీ గుర్తించింది. ఈ కారణంగా తక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం వెల్లడించిన తీర్పు అంతిమం కాదని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో పూర్తి విచారణ జరిగే వరకు బీఆర్హెచ్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు సంబంధించి సెబీ రాజీ పడబోదని స్పష్టం చేసింది. 45 రోజుల్లో ఫైన్ను కట్టాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: రిలయన్స్, అంబానీలకు సెబీ జరిమానా