కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తాం. ప్రభుత్వం కనీస ఆదాయ స్థాయిని నిర్ణయిస్తుంది. ఈ స్థాయికి దిగువన ఉన్న వారందరి ఖాతాలో ఆ డబ్బులు జమ చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరూ కనీస ఆదాయ స్థాయికి చేరుకుంటారు. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
కనీస ఆదాయ పథకం...! సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ వాగ్దానం. వరుస పరాజయాలు చవిచూసిన తమను విజయ తీరాలకు చేర్చేందుకు ఈ హామీనే కీలకమన్నది ఆ పార్టీ నమ్మకం. అసలెందుకీ పథకం?
భారత్ సహా అభివృద్ధి చెందిన, పారిశ్రామిక దేశాల్లో ఆర్థిక వృద్ధికి తగ్గట్లు ఉద్యోగ కల్పన జరగట్లేదు. అభివృద్ధి జరుగుతున్నా ప్రజలకు ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి వారికి ఆదాయం ఉండట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్న దానికి జవాబు సార్వత్రిక ఆదాయ పథకం. దేశంలోని ప్రతి పౌరుడికి కొంత ఆదాయాన్ని ప్రభుత్వం సార్వత్రికంగా అందిస్తుంది. వీరికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధన నిబంధనలు లేకుండా ప్రతి పౌరుడికి కనీస ఆదాయం లభిస్తుంది.
-ఆచార్య అమిత్ బసోలే, అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు
ఇదీ చూడండి :సార్వత్రికం కోసం నారీభేరీ...!
పౌరులందరికీ కనీస ఆదాయమా? భారత్లాంటి పెద్ద దేశాల్లో సాధ్యమేనా?
వ్యయం ఎక్కువవుతున్న దృష్ట్యా వాస్తవ సార్వత్రిక కనీన ఆదాయానికి భారత్ సిద్ధంగా లేదు. దేశంలో ఎక్కువ మంది నిపుణులు ప్రతిపాదించిన వాటిలో కొన్ని వర్గాల వారు భాగం కారు. ఉదాహరణకు అరవింద్ సుబ్రమణ్యం ఇటీవల ప్రతిపాదించిన 'సార్వత్రిక గ్రామీణ కనీస ఆదాయం' పరిధిలోకి 75% గ్రామీణ ప్రజలు వస్తారు. ఇది ప్రభుత్వ వ్యయంపరంగా కూడా ఆమోదయోగ్యం.
-ఆచార్య అమిత్ బసోలే, అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు
కనీస ఆదాయం అంటే ఎంత? ప్రజలకు ప్రభుత్వం ఎంత ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తారు?
దీనికి కచ్చితమైన ప్రామాణికత లేదు. దేశదేశాలకు ఇది మారుతుంది. ఈ పథకంలో అందించేది చాలా తక్కువ. ప్రజలు ఉద్యోగం చేస్తే సంపాదించినంత పొందరు. ప్రతిపాదించిన మొత్తాన్ని గమనిస్తే ఇదే స్పష్టమవుతుంది. అరవింద్ సుబ్రమణ్యం ప్రతిపాదించిన దానిలో మొత్తం ఏడాదికి రూ. 18వేలు. ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన రైతు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఇచ్చేది ఏడాదికి రూ. 6వేలే. ఈ పథకానికి ఆధారమైన తెలంగాణ రైతుబంధు పథకంలో లబ్ధిదారులకు అందించే మొత్తం జాతీయ పథకం కంటే కొంచెం ఎక్కువున్నప్పటకీ... మరీ ఎక్కువేమీ కాదు. ఈ పథకంలో ఇచ్చేది సాధారణంగా తక్కువ ఉంటుంది. దీన్ని గణించటానికి శాస్త్రీయ పద్ధతులు లేవు. సమాజంలోని పేదవారి కొనుగోలు శక్తిని పెంచేలా ఈ మొత్తం ఉండాలి.
-ఆచార్య అమిత్ బసోలే, అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం-బెంగళూరు