భారత్, కిర్గిస్థాన్ వ్యాపార సంస్థలు వివిధ రంగాల్లో ఇప్పటి వరకు గుర్తించని అవకాశాలను వెలికితీయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిష్కెక్లో భారత్-కిర్గిజ్ వర్తక మండలి సదస్సును ఆ దేశ అధ్యక్షుడు సూర్న్బే జీన్బెకోవ్తో కలిసి మోదీ ప్రారంభించారు.
ఈ సదస్సులో ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి కోసం రెండు దేశాలు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ద్వంద్వ పన్నుల రహిత ఒప్పందానికి (డీటీఏఏ) తుది రూపునిచ్చినట్లు చెప్పారు.
పెట్టుబడులతో రండి..
జౌళీ, రైల్వేలు వంటి రంగాల్లో భారతీయ వ్యాపారులకు కిర్గిస్థాన్ మంచి సహకారం అందిస్తోందని మోదీ ప్రశంసించారు. కిర్గిజ్ వ్యాపారులూ భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పెట్టుబడులతో రావాలని మోదీ ఆహ్వానించారు.
"వర్తకం, పెట్టుబడులను పెంచే విషయమై నా దృష్టిలో మూడు అంశాలు ఉన్నాయి. అవి అనుకూల వాతావరణం, అనుసంధానత, వ్యాపారంలో పరస్పర సహకారం. అనుకూల వాతావరణం కోసం ద్వంద్వ పన్నుల రహిత ఒప్పందానికి మేము తుది రూపునిచ్చాం. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపైనా నిర్మాణాత్మక రీతిలో చర్చలు జరుపుతున్నాం. దీని ద్వారా పెట్టుబడులకు మంచి ఊతం లభిస్తుంది. భారతీయ వ్యాపారులతో కలిసి పనిచేయాలని నేను కిర్గిస్థాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాను. కిర్గిస్థాన్లో ఉన్న ప్రోత్సాహమే మీకు భారత్లోనూ లభిస్తుంది." - నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి