ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gurupournami: రాష్ట్ర వ్యాప్తంగా... ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

By

Published : Jul 24, 2021, 12:31 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గుంటూరు చైతన్యపురి కాలనీలోని లక్ష్మీ తిరుపతమ్మ సాయినాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు...గురు పౌర్ణమిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తుళ్లూరు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయ విద్యార్థులు...తమ గురువులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. బెంజ్‌ సర్కిల్‌ సాయిబాబా ఆలయానికి ఉదయం 6 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పలు ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయిబాబా ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా.. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో షిర్డీ సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా అనంతపురంలోని బాబా మందిరాలు.. సాయి నామస్మరణతో మార్మోగాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details