YSRCP Leaders about Lokesh Padayatra: పాదయాత్రను అడ్డుకోవాల్సిన పని మాకు లేదు.. విజయవాడకు టీడీపీ ఏం చేసింది..? - Lokesh Padayatra
YSRCP Leaders about Lokesh Padayatra: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన పని తమకు లేదని.. విజయవాడ నగరానికి చెందిన వైసీపీ నేతలు అన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ నగరానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. యువగళం పాదయాత్ర ప్రకాశం బ్యారేజీకి చేరుకోగానే విజయవాడ అభివృద్ధిని విస్మరించామంటూ లోకేశ్ క్షమాపణలు కోరాలని వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ అన్నారు. లోకేశ్ చేస్తున్నది ఈవెనింగ్ వాక్ అని.. జాకీలు వేసి లేపినా లేవని నాయకుడు లోకేశ్ అని అవినాష్ ఎద్దేవా చేశారు.
ఇటీవల విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థులుగా ఈ ముగ్గురు పేర్లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన తర్వాత.. సీఎంను ఆయన నివాసంలో వీరంతా కలిశారు. యువగళం పాదయాత్ర విజయవాడ నగరంలోకి ప్రవేశించిన వేళ.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.