'ముహూర్తం ఖరారు' పీసీసీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల - andhra pradesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 1:06 PM IST
YS Sharmila will Take Charge as PCC President: ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలు తీసుకోనున్నారు. 21 తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రరత్న భవన్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్, మాజీ కేంద్ర మంత్రులు ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
కాగా ఈ నెల 16 తేదీన ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.