By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 1:29 PM IST
మీ నమ్మకమే ఆమె పెట్టుబడి - బంగారు నగల డబ్బులతో ఉడాయించిన మహిళా ఉద్యోగి
Women Employee Fraud :ఆ మహిళా ఉద్యోగి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకుంది. ఆ నమ్మకంతోనే ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 100 మందికి పైగా ఖాతాదారులను మోసం చేసి వారి బంగారు నగల డబ్బులతో ఉడాయించింది. ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. న్యాయం కోసం కడప డీఎస్పీ షరీఫ్ను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
Women Employee Gold Loans Fraud : కడప శ్రీరామ్ ఫైనాన్స్లో సౌజన్య అనే మహిళా ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించి ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టింది. బంగారం తాకట్టు పెడితే లక్షకు 500 రూపాయల కమీషన్ ఇస్తామని నమ్మబలికింది. కమీషన్కు ఆశపడిన ఖాతాదారులు లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని తనఖా పెట్టారు. కొంత కాలం కమీషన్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కమీషన్ వస్తుందని ఆశతో బాధితులు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అనుకూల సమయంగా భావించిన ఉద్యోగి బాధితుల డబ్బులను తీసుకొని ఉడాయించింది.
విషయం తెలుసుకున్న బాధితులు శ్రీ రామ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్తే తమకు సంబంధం లేదని చెప్పడంతో ఖంగుతిని పోలీసులను ఆశ్రయించారు. బాధితులు నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ భరోసా ఇచ్చారు. 20 లక్షల విలువ చేసే బంగారు నగలను తాకట్టు పెట్టాము. ఇప్పుడు ఉన్నఫలంగా ఉద్యోగి కనిపించకుండా పోవడంతో డబ్బులు, బంగారు నగలు కూడా పోయాయంటూ బాధితులు వాపోతున్నారు.