Woman Leader Dies at TDP Initiation Camp చంద్రబాబు కోసం చేపట్టిన దీక్ష శిబిరం వద్ద విషాదం.. మాట్లాడుతూ కుప్పకూలిన మహిళా నేత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 10:38 PM IST
Woman Leader Dies at TDP Initiation Camp: కాకినాడలో తెలుగుదేశం దీక్షా శిబిరం వద్ద నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కుప్పకూలి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాలాజీ చెరువు సెంటర్ వద్ద నిర్వహించిన రిలే దీక్షా శిబిరంలో చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ తన అభిప్రాయాలను కాకినాడ నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. టీడీపీ పాలనలో చంద్రబాబు అమలు చేసిన పథకాల గురించి వివరించారు. అన్యాయంగా చంద్రబాబుని అరెస్టు చేశారని ఆవేదన చెందారు. అనంతరం నిరాహార దీక్ష చేపట్టిన నాయకులకు మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు నిమ్మరసం ఇస్తుండగా చిక్కాల సత్యవతి కూడా వారిని అనుకరించారు. ఒక్కసారిగా సత్యవతి కుప్పకూలి పడిపోవడంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వెంటనే జీజీహెచ్ కు తరలించగా.. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆవేదన చెందారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి సత్యవతి తీవ్ర మనస్థాపానికి గురయ్యారని కొండబాబు చెప్పారు. 15 ఏళ్లకు పైగా తెలుగుదేశంలో సత్యవతి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని.. ఐదేళ్ల నుంచి కాకినాడ నగర తెలుగు మహిళ అధ్యక్షురాలుగా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారు. మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించారు. తెలుగుదేశం నాయకులు, అభిమానులు భారీగా ఆమె ఇంటి వద్దకు తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు.