Arrest in Attack issue: ధర్మవరం వస్త్ర వ్యాపారులపై దాడి.. ఇద్దరు అరెస్టు - Two people arrest in attack on Silk Sarees
Vijayawada CP on attack on Silk Sarees Traders : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుచీరల వ్యాపారులను విజయవాడ నగరంలోని వారి దుకాణంలోనే నిర్భందించి ఇద్దరు చితకబాదారు. పట్టుచీరల వ్యాపారుల బట్టలు ఊడదీసి, వారిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో 20 రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విజయవాడ సీపీ కాంతిరాణా టాటా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారుల వద్ద అవినాష్ గుప్తా 2.34 లక్షల రూపాయల సరకు తీసుకున్నాడని సీపీ చెప్పారు. అవినాష్ గుప్తా ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో.. రావాల్సిన డబ్బు ఇవ్వాలని అడిగిన వ్యాపారులను బంధించారని, ఇద్దరు వ్యాపారులపై ప్లాస్టిక్ పైపులతో దాడి చేశారన్నారు. అనంతరం 5 లక్షల విలువైన బంగారం లాక్కొని పరారయ్యారని తెలిపారు. అవినాష్ గుప్తా తెనాలికి చెందిన వాసి అని.. అనేకచోట్ల అప్పులు చేశాడని, ఆలయ సిల్క్స్ పేరుతో విజయవాడలో ఓ దుకాణం పెట్టాడని ఆయన చెప్పారు. అవినాష్ గుప్తా ఓ పార్టీకి చెందిన వ్యక్తి అని ఆరోపణలు రావడంతో వాటిని ఆయన ఖండించారు. నిందితులు, బాధితులకు ఏ పార్టీతో సంబంధం లేదని సీపీ స్పష్టం చేశారు.