Finance Minister Nirmala Sitharaman in University Convocation మన దేశంలోనే ఎక్కువ అవకాశాలు.. స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ - విజ్ఞాన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 10:56 PM IST
Vignan University Convocation 2023: ప్రపంచంలో వివిధ దేశాల కంటే ఎక్కువ అవకాశాలు.. మన దేశంలోనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 11వ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో భాగంగా.. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు డా.పావులూరి సుబ్బారావు, విమ్టా ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.ఎస్.పి.వాసిరెడ్డి, ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపికి.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ పేమెంట్ల విషయంలో మనం ముందున్నామని చెప్పారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీలను అందుకోవడానికి ప్రపంచంలో 38 శాతం మంది మాత్రమే తయారుగా ఉంటే.. మన దేశంలో 68 శాతానికి పైగా తయారుగా ఉన్నారని పేర్కొన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద 13 స్టార్టప్ కంపెనీలు మనదేశంలో పెట్టుబడి పెట్టనున్నట్లు నిర్మలా తెలిపారు. సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలలో కాకుండా రేర్ మినరల్స్, మెటీరియల్ సైన్స్, డ్రోన్ టెక్నాలజీ, సహజసిద్ధమైన గ్యాస్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయాలని సూచించారు. చంద్రయాన్–3 ద్వారా ఇస్రో ఘనత ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. 2035 లోపు భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, 2040 నాటికి మానవసహిత ప్రయోగం చేయాలనే లక్ష్యాలను ఇస్రోకు ప్రధాని మోదీ నిర్దేశించారన్నారు. ఈ సందర్భంగా 1820 మందికి పట్టాలు, 51 మందికి బంగారు పతకాలు అందజేశారు.