By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 1:26 PM IST
'దోచుకునే వాడు వద్దు అభివృద్ధి చేసేవాడు ముద్దు'- ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్తులపై కరపత్రం
Unknown Pamphlet on Properties of MLA Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన కరపత్రాలు కలకలం రేపాయి. ఈ కరపత్రాల్లో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్తుల వివరాలు పొందుపరచి ప్రధాన కూడళ్లలో పడేశారు. దోచుకొనే వాడు వద్దు అభివృద్ధి చేసేవాడు ముద్దు అని కరపత్రంలో ముద్రించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గత ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు 53.42 ఎకరాలు ఉన్నాయని, ప్రస్తుతం 189.8 ఎకరాలు ఉన్నాయని కరపత్రాల్లో ముద్రించారు.
యల్లనూరు, పుట్లూరు మండలాల్లో గాలిమరల పరిశ్రమ కోసం రైతులు కేటాయించిన భూములను ఎమ్మెల్యే దౌర్జన్యంగా రాయించుకున్నారని కరపత్రంలో ఆరోపించారు. రైతులను భయపెట్టి ఆక్రమించుకున్న ఆస్తులను ఎవరికీ అనుమానం రాకుండా వారితోనే రిజిస్ట్రేషన్ చేయించుకుని పాసుపుస్తకాలు తీసుకున్నారని, ఇంకా ఎక్కడైతే భూములు కొన్నారో వాటి సమీపంలో కొండలు, గుట్టలు, అటవీ భూములు కూడా ఆక్రమించుకొని వందల ఎకరాలను సేకరించుకునేందుకు నిత్యం కష్టపడుతున్నారని కరపత్రంలో తెలియజేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలు వేయడంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.