Two Children Died After Falling into River: గోనెపూడిలో విషాదం.. వాగులో పడి అన్నాదమ్ములు మృతి - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 7:00 PM IST
Two Children Died After Falling into River:పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు ఏడుమంగళం వాగులో పడి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నరసరావుపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనెపూడి గ్రామానికి చెందిన వెలుగు చెంచు శివనాయక్, శివ కొటేశ్వరమ్మలకు మణికంఠ (10), నవీన్ కుమార్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. ఆ చిన్నారులు గ్రామ శివారులోని ఏడుమంగళం వాగు వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు వాగులో పడ్డారు.
ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు నీళ్లల్లో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. అప్పటికే వారు మృతి చెందారు. స్థానికులు మృతి చెందిన ఇద్దరు చిన్నారులను బయటకు తీసి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.