నీరు తాగేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు - నీటి కుంటలో పడి మృతి - ఇద్దరు పిల్లలు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 10:51 PM IST
Two Children Died Falling into Puddle in Gollavidipi:ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాత గొల్లవిడిపి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలోని నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సంక్రాంతి పండగ సందర్భంగా స్కూల్కు సెలవులు కావడంతో తల్లిదండ్రులతో కలిసి చిన్నారులు పొలానికి వెళ్లారు. అక్కడే ఉన్న నీటి కుంటలో నీరు తాగేందుకు దిగారు. దీంతో నీటి కుంటలోకి జారిపోయి ఒకరి వెంట ఒకరు పడిపోయారు. కొద్ది సేపటి తర్వాత పిల్లలు కనిపించట్లేదని గమనించిన కుటుంబ సభ్యులు కంగారు పడి పరుగెత్తుకుంటూ వెళ్లి చుశారు. కుంటలో పడి ఉన్న చిన్నారులను చూసి వెంటనే బయటకు తీశారు.
అప్పటికే చిన్నారులిద్దరూ మరణించారని తెలియటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చిన్నారులు నార్నపాటి శివాంజి (8), సాయి (10) అని స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండగ వాతావరణంతో ఉండాల్సిన గ్రామం శోకసంద్రంగా మారింది. చిన్నారుల మృతితో స్థానికులు అంతా భావోద్వేగానికి గురయ్యారు.