APCC Chairman Tulasi Reddy criticized the YCP government : ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం అప్పు, అవినీతి, అరాచకం, మద్యం, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న వైసీపీ పని అయిపోందని.. వైకాపా శ్రేణులు స్వగృహ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని చెప్పారు. ఎన్నికల ముందే జగన్ జైలుకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. మహిళలు, మందుబాబులు, యువత ఆవేశంలో ఉంటే.. రైతులు, సర్పంచులు రగిలిపోతున్నారు. ఉద్యోగులు వణికి పోతున్నారు. కార్మికులు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారని తులసి రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను మాఫియా రాజ్యం ఏలుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రోజురోజూకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. దీంతో పార్టీకి కచ్చితంగా గత వైభవం వస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమని అన్నారు. కావున 'వైకాపా శ్రేణులు కాంగ్రెస్లోకి రండి, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేద్దాం.. అలానే రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని నెరవేరుద్దాం' అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల కార్యక్రమం అమలు చేస్తామని అన్నారు.