AP Tribal Employees ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను తీవ్రంగా ప్రతిఘటిస్తాం: అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం - tribals fires on government
Tribal Employees Welfare Association: ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను సమైక్యంగా ప్రతిఘటిస్తామని అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సమావేశం విశాఖపట్నంలోని గిరిజన్ భవన్లో నిర్వహించారు. గిరిజనుల సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల ఐటీడీఏ వంటి సంస్థల సేవలు గిరిజనులకు అందడం లేదని సంఘం జాతీయ కార్యదర్శి డాక్టర్ వి. తిరుపతిరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు చేపడుతుండడం వలన లక్షలాది గిరిజనులు నిరాశ్రయులు అవుతున్నారని.. వారికి నష్టపరిహారం ఇంకా చెల్లించలేదని తెలిపారు. గతంలో ప్రాజెక్టుల వల్ల గిరిజనులు కొండలపైకి తరలిపోవాల్సి వచ్చేదని.. ఇకపై తమ ప్రయాణం మైదాన ప్రాంతాల వైపు ఉంటుందని తిరుపతిరావు హెచ్చరించారు. 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కుతుండటం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంస్కృతిని సంరక్షించే ఆదివాసీ వాలంటీర్ల వ్యవస్థని ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కి చింతపల్లి, అనంతగిరి ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల పెద్ద ఎత్తున గిరిజనులు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.