Tataiahgunta Gangamma Jatara Ends Tomorrow : తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వారం రోజుల నుంచి కన్నుల పండగగా సాగుతోంది. జాతరను పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు, అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం అమ్మవారికి అర్చకులు ఘనంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు పసుపు, కుంకుమలతో సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. జిల్లా నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సప్పరాలను ధరించి నృత్యాలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు (బుధవారం) ఉదయం అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. పాలెగాళ్ల అరాచకలను అంతం చేసేందుకు ఉద్భవించిన గంగమ్మకు.. రోజుకోక వేషధారణలో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.