విశాఖలో నువ్వు పోటీ చేస్తావా - పులివెందులలో నన్ను పోటీ చేయమంటావా : బి. వి. రామ్ - CM Jagan X BV Ram
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 9:03 PM IST
Telugu Shakti President BV Ram Fires On CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మండిపడ్డారు. మూడు రాజధానుల విధానాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో పులివెందుల ప్రజలు జగన్ను ఓడించి ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని నిలెబెట్టాలన్నారు. విశాఖ ప్రజలు రాజధాని వద్దని అంటున్న ప్రభుత్వం బలవంతగా రుద్దాలని చూస్తోందని, దీనికి న్యాయస్థానాలు కూడా ఒప్పుకోవటం లేదన్నారు. ప్రతిదానికి నా అక్కచెల్లెమ్మలు అనే జగన్, రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున కనిపించకుండా పోతున్న కేసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటి తప్పులు చేయకపోయినా జైల్లో పెట్టి పగ సాధించుకున్నారని బీవీ రామ్ ఆరోపించారు.
సీఎం జగన్కు అభివృద్ధి చేతకాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే 'ఆట నువ్వు మొదలు పెట్టావ్ వేట ఎలా ఉంటుందో మేము చూపిస్తాం' అనే ఆడియో పాటను విడుదల చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసిందని, దీంతో ప్రతి ఒక్కరు 'మాకోద్దు జగన్ గో బ్యాక్' అంటూన్నారన్నారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం నడుస్తున్నాడని, ప్రజలు వైసీపీ సభల నుంచి బయటకు వెళ్తుంటే పోలీసులతో అడ్డగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విశాఖలో పోటీచేసి విజయం సాధించాలని లేకపోతే తానే పులివెందులలో పోటీ చేస్తానని రామ్ అన్నారు.