CBN on handloom traders attack వైసీపీ పాపాలకు అంతు లేకుండా పోయింది.. చేనేత వ్యాపారులపై దాడులా !: చంద్రబాబు - ap cm jagan
Chandrababu Condemned the attack on handloom traders: రాష్ట్రంలో ప్రతీ చోటా ప్రభుత్వ టెర్రరిజం అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పటం ఖాయమని హెచ్చరించారు. బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడ్డారని బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారని చంద్రబాబు దుయ్యబట్టారు. రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ పై కేసు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారని విమర్శించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను.. వైసీపీ అనుబంధ విభాగంగా మార్చిన దుస్థితే ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి తమ పోకడలపై ప్రజలు ఏమనుకుంటారో అనే భయం లేదన్న చంద్రబాబు, సమాజం అన్నీ గమనిస్తోందని వెల్లడించారు.