టిడ్కో ఇళ్లు బ్యాంకులకు తనఖా పెట్టొద్దు - లబ్ధిదారులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధర్నా - TDP MLA Nimmala Ramanaidu news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 9:27 PM IST
TDP MLA Nimmala Ramanaidu Dharna On Tidco Houses Construction: తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను బ్యాంకులకు తనఖా పెట్టకూడదంటూ.. ఏలూరు జిల్లా పాలకొల్లు సహకార కేంద్ర బ్యాంకు ముందు లబ్ధిదారులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన చేపట్టారు. పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ.. ఆనాడు చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్లు నిర్మిస్తే.. వాటిని బ్యాంకులకు తనఖా పెట్టి, లబ్ధిదారులకు నోటీసులు వచ్చేలా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందని ఆయన ఆరోపించారు. లబ్ధిదారుల పేరుతో ప్రభుత్వం రుణాలు తీసుకోవడం దారుణమని మండిపడ్డారు.
Nimmala Ramanaidu Comments: ''నిరుపేదలు, మహిళల సొంతింటి కలను నెరవేర్చడం కోసం ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మా పార్టీ అధినేత చంద్రబాబు టిడ్కో ఇళ్లు నిర్మించి, లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పడు వాటిని బ్యాంకులకు తనఖా పెట్టి, లబ్దిదారులకు నోటీసులు వచ్చేలా ఈ జగన్ ప్రభుత్వం చేసింది. టిడ్కో ఇళ్ల రుణానికి సంబంధించి వాయిదాలు చెల్లించాలంటూ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే లబ్దిదారుల పేరుతో రుణాలు తీసుకుని ఖాతాలో వేసుకుంటున్న జగన్ ప్రభుత్వం.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు రుణం చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణం. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం మాట తప్పడం కాదా జగన్..?'' అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.