'దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలనుకుంటోంది' - తిరుపతిలో టీడీపీ నాయకుల ఆందోళన - TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 3:59 PM IST
TDP Leaders Protest on Bogus Votes in Tirupati: దొంగ ఓట్లు తొలగించాలంటూ తిరుపతిలో తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. స్విమ్స్ కూడలి నుంచి నగరపాలక సంస్ధ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్ధ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. డబుల్ ఎంట్రీలు, జీరో డోర్ నెంబర్, చనిపోయిన వారి ఓట్లపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఓట్లను తొలగించాలంటూ ఉప కమిషనర్ చంద్రమోళి రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
దొంగఓట్లకు సహకరిస్తున్న అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని, అలా చేస్తే దొంగ ఓట్ల బెడద తీరుతుందని తెలిపారు. దొంగఓట్లతో తిరుపతిలో వైసీపీ గెలవాలని చూస్తోందని ఆరోపించారు. దాదాపు 38 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, ఇలా అయితే ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత లేకపోయినా దొంగఓటు వేసిన వైసీపీ కార్పొరేటర్లు నవ్వులపాలయ్యారని, ఇప్పటికైనా దొంగఓట్లను అధికారులు తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తిరుపతిలో టీడీపీనే గెలుస్తుందని అన్నారు.