14వ రోజు ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 1:35 PM IST
SSA Employees Agitate by Hanging: బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిరు ఉద్యోగుల ఉసురు తీసేలా వ్యవహరిస్తోందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా మెుండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగైదు నెలలకు జీతం ఇస్తుంటే ఎలా జీవించాలని సమగ్రశిక్ష ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు నేరవేర్చాలని కోరారు. అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని, ప్రభుత్వం జీతాలు పెంచకపోగా 3,4 నెలలు బకాయిలు పెడుతోందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేరవేర్చి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమగ్రశిక్ష ఉద్యోగులు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.