Road Destroyed for CM Jagan Meeting: రాజధాని ప్రాంతంలో సీఎం జగన్ సభ కోసం ఏర్పాట్లలో భాగంగా రోడ్డును ధ్వంసం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. రాజధానిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా.. అమరావతి వాసుల కోసం వెంకటపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ సుజల క్లస్టర్ పథకంలో భాగంగా నిర్మించిన రహదారిని అధికారులు ధ్వంసం చేశారు. వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే సీఎం జగన్ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేల చదునులో భాగంగా తాగునీటి సరఫరా కోసం వాహనాలు తిరిగేందుకు నిర్మించిన మెటల్ రోడ్డు అడ్డుగా ఉందని తవ్వేశారు. ఈ రహదారి ద్వారానే ఎన్టీఆర్ సుజల స్రవంతి రక్షిత నీరు 29 గ్రామాలకు తరలిస్తున్నారు. నిత్యం 12 ట్రాక్టర్లతో 60 వేల లీటర్లను 29 గ్రామాలకు పంపిస్తారు. ఆరేళ్ల క్రితం నిర్మించిన ఈ రహదారి మధ్యలో గుంతలు పడితే రైతులే స్వయంగా మరమ్మతులు చేశారు. సభ ఏర్పాట్లలో భాగంగా ఈ రహదారిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీని కారణంగా ట్యాంకర్లు గ్రామాలకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.