Public Fire on Industry Expansion: కాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఆగ్రహం - sugna sponge industry expansion
Public Fire on Industry Expansion: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోగసముద్రంలో పరిశ్రమ విస్తరణ కోసం అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వివాదాస్పదంగా మారింది. బోగసముద్రంలోని సుగుణ స్పాంజ్ ఐరన్ పరిశ్రమ విస్తరణ కోసం జిల్లా సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమ విస్తరణకు అనుమతి ఇవ్వరాదని ప్రజలు నినాదాలు చేశారు. పోలీసులు అదుపు చేసే యత్నం చేయటంతో చుట్టుపక్కల గ్రామస్థులంతా తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల బెదిరింపులతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అధికారుల యత్నాన్ని గ్రామస్థులు తిప్పికొట్టారు. పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. చివరకు సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్.. ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం ఉండదని ప్రజారోగ్యమే ప్రాధాన్యతగా అనుమతులు ఉంటాయని చెప్పారు.