Pournami Garuda Seva: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ - pournami garuda seva
Pournami Garuda Seva at Tirumala: తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. పౌర్ణమి గరుడ సేవసందర్భంగా వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేబుతారు.
ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే అదే రోజున తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించారు. గరుడ వాహన సేవను కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైన మలయప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.