Political Heat in Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. గత కొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆనూరుకొండ అక్రమ మైనింగ్తో రాజప్ప కోట్లు కొల్లగొట్టారని.. దొరబాబు ఆరోపించారు. అయితే.. మైనింగ్ను ఆపించిందే తానని.. దొరబాబు నియంత్రించలేకపోయారని రాజప్ప విమర్శించారు. ఈ క్రమంలో లైడిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. సోమవారం ఉదయం పెద్దాపురం మున్సిపల్ సెంటర్కు రావాలని చినరాజప్పకు దొరబాబు సవాల్ విసిరారు. అందుకు సిద్ధమైన చినరాజప్ప కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. వైసీపీ శ్రేణులూ ర్యాలీగా బయలుదేరారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకోవడంతో.. తోపులాటకు దారి తీసింది. పోలీసులు.. ఎవరి కార్యాలయాలకు వారిని పంపించేశారు. అనంతరం మున్సిపల్ సెంటర్కు వెళ్లేందుకు టీడీపీ, వైసీపీ నేతలు సిద్ధపడగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెప్పారు. దీంతో పార్టీ కార్యాలయాల వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత ఎవరికి వారు వెనక్కి వెళ్లిపోయారు.