చిలకల జాతరకు పోటెత్తిన జనం.. దేవుని గదిలో చిలక, చాట - Perantalamma jatara
Payakaraopeta Chilakala Theertham: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో.. ఏటా ఉగాది పర్వదినాన నిర్వహించే పేరంటాలమ్మ వారి జాతర చాలా ప్రత్యేకమైనది. దీనిని చిలకల తీర్థం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ పంచదార చిలక, చాట కొని అమ్మవారికి పెడతారు. అలా పెట్టడం వలన శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు సమీప జిల్లాలైన కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ పంచదార చిలక, చాట కొనడం ఈ జాతరకు వచ్చిన భక్తుల ఆనవాయితీ. ఈ జాతరకు వచ్చిన భక్తులు రంగురంగుల పంచదార చిలకలను, చాటలను కొనుగోలు చేసి.. అమ్మవారికి పెట్టారు. భారీగా తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పోలీసులు భారీగా బందోబస్తు కల్పించారు.