డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై గ్రామస్థుల ఆందోళన - సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే - dumping yard issue
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 5:21 PM IST
People Protest Against Dumping Yard Centers : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక నివాస ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు కేంద్రానికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లా ముమ్మడివరం మండలం గోపాల్నగర్ గ్రామ ప్రజలు నిరసనకు దిగారు. గ్రామాల మధ్య చెత్త కేంద్రాలు ఏర్పాటు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డు మార్చాలంటూ ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మరోచోట ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రతిరోజూ యానంలో సుమారు 9 టన్నుల చెత్తను ప్రైవేటు సంస్థ సేకరించి కనకాలపేట మార్గంలోని రహదారి పక్కన డంపింగ్ చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఆందోళన చేస్తున్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నా స్థానికులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సంఘీభావం తెలిపారు. ప్రజాభిప్రాయాలను సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని గొల్లపల్లి పేర్కొన్నారు. జనావాసాలకు దూరంగా ఉండేలా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.