మంగళగిరిలో లోకేశ్ పర్యటన - తటస్థులతో యువనేత భేటీ - లోకేశ్ తాడేపల్లి పర్యటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 3:24 PM IST
Nara Lokesh Visit Tadepalli: మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తాడేపల్లిలో తటస్థ ప్రముఖులతో లోకేశ్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి తాడేపల్లిలోని దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, సోమేశ్వరరావు ఇంటికి వెళ్లి లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గ అభివృద్దిపై తన ప్రణాళికలను వివరించారు.
మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలను అభివృద్ది చేస్తూ, అండగా నిలుస్తుందని లోకేశ్ చెప్పారు. బీసీలకు పుట్టినిల్లైన తెలుగుదేశం పార్టీ ద్వారా అభ్యున్నతి సాధ్యమన్నారు. జగన్ ప్రభుత్వ విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని తెలిపారు. విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కొల్లగొడుతూ పేదవిద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్గా మార్చే అభివృద్ధి ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, ఇందుకు సహకారం అందించాలని ప్రజలను కోరారు.
ఆసక్తిగా చిన్నారితో లోకేశ్ స్పందన: తటస్థుల ఇంటికి లోకేశ్ స్వయంగా వెళ్లి, నియోజక వర్గ అభివృద్ధి ప్రణాళికలను నేతలకు చెప్పడంపై స్థానిక నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటిలోని చిన్నారి లోకేశ్ చేయి తాకి వెళ్లడం ఆసక్తిగా మారింది. అంతే స్థాయిలో లోకేశ్ ప్రతిస్పందించడంతో ఆ దృశ్యం చూడముచ్చటగా నిలిచింది.