Nadendla Manohar on Polavaram: అసమర్ధ పాలనతో రాజధాని అమరావతిని చంపేసిన సీఎం జగన్.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా చేతులెత్తేశారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరులో జరిగిన జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో నాదెండ్ల మనోహర్ , జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడి ప్రజలు పోరాటం కోసం జనసేన వైపు చూస్తున్నారని మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి కారణంగా.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి అమరావతికి ఆరు కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో పోతున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం రోడ్లపై వెళ్లేనే.. అవి ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించలేకపోతున్న సీఎం జగన్.. రైతుల్ని, నిర్వాసితుల్ని మోసం చేశారని మనోహర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి జనసేన పార్టీ సాగుతున్నట్లు స్పష్టం చేశారు.