Nadendla Manohar comments on Jagananna Suraksha: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసినప్పుడు స్పందన, సురక్ష వంటి కార్యక్రమాలతో పనేంటని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసెన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో అనేక వర్గాల నుంచి వారి సమస్యలపై వినతి పత్రాలు అందాయని.. వాటిలో దివ్యాంగుల పెన్షన్లు, రోడ్లపై ఎక్కువ వినతి పత్రాలు వచ్చాయని వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటాలకు, ప్రచారాలకు, ప్రత్యర్థులపై దాడులకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. సమస్యలు లేవనెత్తిన ప్రజలపై, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో జగనన్నకి చెబుదాం, జగన్న భరోసా కార్యక్రమాల ద్వారా చెయ్యలేని పనులు ఇప్పుడు సురక్ష అని పెట్టి పేద ప్రజలను ఏమి ఉద్దరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై పవన్ కల్యాణ్ మాట్లాడితే వాటిపై స్పందించకుండా, సంస్కారం కోల్పోయి వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పొత్తులపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.