By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 9:48 PM IST
MLC Ashok Babu Letter to CEO: టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారు: అశోక్బాబు
MLC Ashok Babu Letter to CEO: రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై అధికార వైసీపీపై విమర్శలు, ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా... వీటిని నిజం చేస్తూ పలు చోట్ల వందల సంఖ్యలో అక్రమంగా ఓట్లను తొలగించినట్లు తేలింది. అదే విధంగా వీటికి కారణమైన అధికారులపై వేటు వేశారు. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఒక పార్టీ ఓట్లను తొలగించాలని చూస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు లేఖ రాశారు. నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల 10 వేల ఓట్లు తొలగించాలని బీఎల్వోలపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై నరసాపురం ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు సైతం సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఫారం -7 దరఖాస్తులపై దృష్టి సారించి అక్రమాలకు పాల్పడుతున్న బీఎల్వోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు రాజకీయ ఒత్తళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.