Villagers blocked MLA Reddy Shanti: "మా ఊరెందుకొచ్చారు.. ఇంకెప్పుడూ ఇటు రాకండి.." ఎమ్మెల్యేకు నిరసన సెగ - ఎమ్మెల్యే రెడ్డి శాంతిని గ్రామస్తులు అడ్డుకున్నారు
Villagers blocked MLA Reddy Shanti: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామంలో నిరసన సెగ తగిలింది. కుంటిభద్రలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన అనుచరులతో గ్రామానికి రాగా.. స్థానిక మహిళలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశతో ఓటు వేసి కష్టపడి గెలిపించామన్నారు. నాలుగేళ్లు అవుతున్నా తమ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు పూర్తిగా శిథిలమైనప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదని, తాగునీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఆ సౌకర్యం లభించలేదని మహిళలు నిలదీశారు. కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్న మీరు మా గ్రామానికి ఎందుకు వచ్చారని అడ్డుకున్నారు. భవిష్యత్తులో మరెప్పుడూ మా గ్రామానికి రావద్దు అంటూ గట్టిగా చెప్పారు. స్థానికుల నిరసన ఉద్ధృతం కావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు.