MLA Kondeti Chittibabu: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! - Mandal Parishad meeting in ap
MLA Kondeti Chittibabu comments: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎంపీపీ అంబటి భూలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ధాన్యం కొనుగోలులో రైతులు నష్టపోయారన్నారు. గత ఏడాది వరదలకు లంక గ్రామాల్లో గృహాలు కోల్పోయిన పేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేయలేదన్నారు .గ్రామంలోని సమస్యలపై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదంటూ.. ఇకనైనా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. సర్పంచులకు ఎటువంటి అధికారాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలు, రహదారుల పక్కనే ఉండే ఆక్రమణలను తొలగించాలని పలుసార్లు అధికారులకు చెప్పినా... పట్టించుకోలేదని ఎమ్మెల్యే చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా ఆక్రమణ తొలగించకపోతే అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోవాలని చిట్టిబాబు స్పష్టం చేశారు.