మొబైల్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో యువగళం.. స్టెప్పులేసిన జేసీ అస్మిత్ రెడ్డి - jc asmith reddy dance in yuva galam
Yuvagalam Drone Visuals: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. రాకాసి మూకల దౌర్జన్య పాలనపై నిప్పులు చెరుగుతూ.. రాష్ట్రంలో మహిళలు, యువతకు వెన్నుదన్నుగా నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 2023 జనవరి 27న కుప్పంలో మొదలైన పాదయాత్ర నేడు 69వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పూర్తై.. నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. ప్యాపిలిలో మొదలై 14 నియోజకవర్గాల మీదుగా వెళ్తూ ఆళ్లగడ్డలో ముగియనుంది. సుమారు నెలరోజుల పాటు యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగనుంది. ఇందుకు టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.
అయితే లోకేశ్ యువగళం పాదయాత్రకు ఊహించని రీతిలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. వైసీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్తో చెప్పుకుని బాధపడుతున్నారు. ఎక్కడ పాదయాత్ర జరిగిన మేమున్నామంటూ లోకేశ్ వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. గజమాలలతో సత్కరాలు, హారతులు, పూలతో అభిషేకాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా తాడిపత్రి నియోజకవర్గంలోని రాయలచెరువులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి లోకేశ్ ఓ విజ్ఞప్తి చేశారు. వచ్చిన వాళ్లంతా తమ సెల్ఫోన్లలో ఫ్లాష్లైట్ ఆన్ చేయాలని కోరగా.. ప్రతి ఒక్కరూ అలానే చేయడంతో.. అది జనసంద్రాన్ని తలపించింది. ఫ్లాష్ లైట్ వెలుతురులోనే లోకేశ్ వాళ్లతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి స్టెప్పులు వేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు.