లోక్ అదాలత్లకు భారీ స్పందన - ఒక్క రోజులోనే 21,574 కేసుల పరిష్కారం - Judges of AP High Court
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 10:14 AM IST
Lok Adalat Successful in AP : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు మంచి స్పందన లభించింది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ A.V శేషసాయి మార్గదర్శకాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా దిగువ న్యాయస్థానాల్లో శనివారం 386 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. పరిష్కారమైన 21,574 కేసుల్లో 16,807 పెండింగ్, 4,767 ప్రిలిటిగేషన్ కేసులున్నాయి.
హైకోర్టు ప్రాంగణంలోనే న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలోని లోక్ అదాలత్ లో జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు పాల్గొన్నారు. ఇందులో 137 కేసులను పరిష్కరించి రూ. 2.85 కోట్ల పరిహారం అందజేశారు. అలాగే రాజీకి అవకాశం ఉన్న పలుకేసుల్ని ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత కృతజ్ఞతలు తెలిపారు.