యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన.. లోకేశ్కు తృటిలో తప్పిన ప్రమాదం.! - యువగళం పాదయాత్ర
HUGE RESPONSE TO LOKESH YUVAGALAM PADAYATRA: రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. 2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్కు ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ లోకేశ్కు ఘనస్వాగతాలు పలుకుతూనే ఉన్నారు. ఇప్పటికే 700 కిలోమీటర్ల పాదయాత్రను లోకేశ్ పూర్తి చేసుకుని మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు. లోకేశ్ పాదయాత్రకు జనస్పందన ఏవిధంగా ఉందో ఉరవకొండే అందుకు నిదర్శనం. 61వ రోజు ఉరవకొండలో యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రభంజనం కనిపించింది. లోకేశ్కు మద్దతుగా, ఆయన వెంట నడిచేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో ఉరవకొండ వీధులు కిక్కిరిసాయి. పాదయాత్రలోనూ, బహిరంగ సభలోనూ శ్రేణులు అదే ఉత్సాహం కనబరిచాయి. గత 61రోజులుగా సాగుతున్న యువగళం పాదయాత్రలో ఉరవకొండ స్పందన హైలైట్ అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు ఉరవకొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేశ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కూడేరులో క్రేన్ నుంచి భారీ గజమాల తెగి లోకేశ్పై పడింది. దీంతో ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు లోకేశ్ వద్దకు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. లోకేశ్ పాదయాత్రకు పెద్ద ఎత్తున జనం పోటెత్తుతున్నా.. భద్రతా లోపాలు వెంటాడుతున్నాయని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా లోపం కారణంగా కదిరి లోనూ లోకేశ్ కుడి భుజానికి గాయమయ్యిందని వారు గుర్తు చేశారు.