High Alert Over Martyrs' Week: మావోయిస్టుల వారోత్సవాలు.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత - High Alert Over Martyrs Week
Weekly celebrations of Maoists at AOB: 'భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎత్తిపడదాం.. వారి ఆశయ సాధనకు తుది వరకు పోరాడుదాం. జులై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ గ్రామ గ్రామాన అమరుల సంస్మరణ సభలు జరుపుకుందాం' అంటూ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. మావోయిస్టుల వారోత్సవాలను అడ్డుకోవడానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులలో గ్రేహౌండ్స్, స్పెషల్ ఫోర్స్, సీఆర్ఫీఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో అనుమానితంగా ఉన్నవారిని తనీఖీ చేయటం మొదలుపెట్టింది.
నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేటి (జూలై 28) నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టులు.. అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, మావోయిస్టులు.. రెండు వారాల ముందుగానే పలు ప్రాంతాల్లో అమరుల వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వెదజల్లడంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారోత్సవాల్లో భాగంగా అమరులైన మావోయిస్టులకు స్థూపాలు నిర్మించి, వారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు అగ్రనేతలు ఇప్పటికే ఆంధ్రా-ఒడిశా సరిహద్దులకు చేరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీస్ బలగాలను రంగంలోకి దింపి.. గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. మరోవైపు నేటి నుంచి ఏఓబిలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు మొదలుకానుడంతో సరిహద్దు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు, రైతులు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని తెగ భయపడుతున్నారు.