పెంచిన విద్యుత్ ధరలతో జీవనం అస్తవ్యస్తం! కూలీ రేట్లు పెంచాలని చేనేత కార్మికులు ఆందోళన - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 9:15 PM IST
Handloom Workers Strike in Guntur District : ప్రస్తుత ధరల ప్రకారం తమకు కూలి రేట్లు పెంచాలని గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికుల ఐక్య కమిటీ ప్రతినిధులు మాస్టర్ వీవర్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మాస్టర్ వీవర్స్ అసోసియేషన్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండేళ్లకోసారి మజూరి ధరలు పెంచాలని కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరల ప్రకారం కూలి రేట్లు పెంచాలని మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు చేనేత కార్మికులు వినతి పత్రం అందించారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో కార్మికుల రోజువారి జీవనం కష్టతరంగా మారిందని సమన్వయ కమిటీ సభ్యులు చెప్పారు.
కృష్ణాజిల్లా పెడన, అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలతో తమ జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. జీఎస్టీ పేరుతో నూలుపై విధించిన ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ వీవర్స్ సభ్యులతో చర్చించి మజూరి పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కార్మికులకు హామీ ఇచ్చారు.