Dhulipala On GNT channel: గుంటూరు ఛానల్ను పొడిగించి.. సాగు, తాగునీరు అందించాలి: ధూళిపాళ్ల నరేంద్ర - Ex MLA Dhulipalla Narendra comments
Dhulipalla demand to release the funds of Guntur channel: గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించి.. రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ పొడిగించాలని.. గతకొన్ని రోజులుగా గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నల్లమడ రైతు సంఘం చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రతిపక్షంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఛానల్ను పొడిగిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని నరేంద్ర గుర్తు చేశారు. నాలుగేళ్లయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయపోవడం దారుణమన్నారు.
15వ రోజుకు చేరిన నిరసన దీక్ష..గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలంటూ.. నల్లమడ రైతు సంఘం చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమం నేటితో 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. అధికారం చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ నిధులు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, సీఎం జగన్ స్పందించి వెంటనే గుంటూరు ఛానల్కు నిధులు విడుదల చేసి, గుంటూరు వాహిని పొడిగింపు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుంటూరు ఛానల్ పొడిగింపుపై, నిధుల విడుదలపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ పోరాడుతూనే ఉంటామని రైతులు తేల్చిచెప్పారు.