Gudivada YSRCP Leaders Clashes గుడివాడ వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు.. నడిరోడ్డుపై తోపులాటలు, కారు అద్దాలు ధ్వంసం - ఏపీ వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 7:44 PM IST
Gudivada YSRCP Leaders Clashes గుడివాడ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అధికార పార్టీకి చెందిన నేతలు బాహాబాహికి దిగడంతో గుడివాడలో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ఎంపీ బాలశౌరి ఎదుటే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. నూతనంగా మంజురైన పింఛన్లను ఎంపీ బాలశౌరి...గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే సమయంలో కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు, కొడాలి నాని అనుచరుడు, ప్రైవేట్ బస్ యాజమాని సుధాకర్కు నెహ్రూచౌక్ వద్ద వాగ్వాదం జరిగింది. సుధాకర్ కారుపై హనుమంతరావు దాడి చేసి... అద్దాలు ధ్వంసం చేశారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల పోటాపోటిగా తలపడటంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థిని అదుపులోకి తీసుకు వచ్చిన పోలీసులు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ కారును స్టేషన్కు తరలించారు.